దిల్లీ: పసిడి ధరకు రెక్కలొచ్చాయి. వరుసగా మూడో రోజు ధర పెరగడంతో దేశీయ మార్కెట్లో బంగారం ధర రూ. 33వేలకు చేరువైంది. బుధవారం 10 గ్రాముల పసిడి ధర రూ. 110 పెరిగి రూ. 32,800లకు చేరింది. పెళ్లిళ్ల సీజన్ దగ్గరపడుతుండటంతో స్థానిక నగల వ్యాపారుల నుంచి బంగారం కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయి. దీంతో ధర పెరిగిందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మూడు రోజుల్లో పసిడి ధర రూ. 300 పెరిగింది. ఇక వెండి ధర కూడా నేడు బంగారం దారిలోనే పయనించింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో బుధవారం ఒక్కరోజే రూ. 300 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 40,100 పలికింది. కాగా.. అంతర్జాతీయంగా ఈ లోహల ధరలు కాస్త తగ్గాయి. న్యూయార్క్ మార్కెట్లో పసిడి స్వల్పంగా తగ్గి ఔన్సు ధర 1,283.10 డాలర్లుగా ఉంది. వెండి ధర కూడా 0.26శాతం తగ్గి ఔన్సు ధర 15.67డాలర్లు పలికింది.