అనుమతి లేకుండా కరపత్రాలు అంటిస్తే జరిమానాలు విధించే పోలీసులకే హైదరాబాద్ నగర పాలక సంస్థ జరిమానా విధించి సంచలనం సృష్టించింది.అది కూడా కరపత్రాలు అతికించినందుకే ఈ జరిమానా విధించడం మరో ఆసక్తికర విషయం.వివారాల్లోకి వెళితే బోనాల సందర్భంగా ప్రజలకు పలు సూచనలు చేస్తూ గోల్కోండ పోలీసులు పలుచోట్ల కరపత్రాలు అతికించారు.అయితే అనుమతి లేని చోట్ల కరపత్రాలు అతికించారంటూ సర్కిల్-13కు చెందిన డిప్యూటీ మునిసిపల్ కమిషనర్ గోల్కొండ పోలీసులకు రూ.10వేల జరిమానా విధించడం సంచలనంగా మారింది.ఈ పోస్టర్ లో డీజీపీ మహేందర్ రెడ్డి.. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజని కుమార్తో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారుల ఫోటోలు ఉన్నాయి.గోల్కొండ పోలీస్ స్టేషన్ కు జీహెచ్ ఎంసీ అధికారులు జరిమానా వేసిన విషయం బయటకు రావటంతో సంచలనంగా మారింది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఉండాలే కానీ ఇలా ఫైన్లు వేసుకోవటం సమంజసం కాదన్న భావనకు ఉన్నతాధికారులు వచ్చినట్లు తెలిసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ జీహెచ్ ఎంసీ కమిషనర్ దానకిశోర్ తో మాట్లాడారు. దీంతో.. చలానా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు..