ఎమ్మెల్యేల మనస్తాపం సహజమే

ఎమ్మెల్యేల మనస్తాపం సహజమే

జైపూర్ : ‘ఎమ్మెల్యేలు మనస్తాపం చెందడం సహజమే. ఏవైనా సమస్యలు ఉండే వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంద’ని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చెప్పారు. బుధవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు సంయమనంతో వ్యవహరించాలని శాసనసభ్యులకు సూచించినట్లు తెలిపారు. ‘కలిసికట్టుగా అంతా పనిచేయాల్సి ఉంటుంది. దూరంగా వెళ్లిన మా మిత్రులు ఇప్పుడు తిరిగి వచ్చారు. అన్ని విభేదాలు విస్మరించి, రాష్ట్రానికి సేవలందించేందుకు అంతా పునరంకితం కావాలి’ అన్నారు. రాహుల్ గాంధీని అసమ్మతి నేత సచిన్ పైలట్ గత సోమవారం కలుసుకోవడంతో రాజస్థాన్లో తలెత్తిన రాజకీయ సంక్షోభానికి తెరపడింది. అసమ్మతి ఎమ్మెల్యేల సమస్యలను తెలుసుకునేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ ఏర్పాటు చేశారు. గత ఆదివారం గెహ్లాట్ ఎమ్మెల్యేలందరకూ రాసిన లేఖలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ప్రజా వాణిని గుర్తెరగాలని, ప్రజాప్రయోజనాల దృష్ట్యా సత్యానికి వెన్నుదన్నుగా నిలబడాలని కోరారు.

తాజా సమాచారం