ముంబయి: ప్రాణాపాయ స్థితిలో ఉన్న టీమిండియా మాజీ క్రికెటర్ జాకబ్ మార్టిన్కు తామంతా అండగా ఉన్నామని మాజీ సారథి సౌరవ్ గంగూలీ అన్నారు. మీరు ఒంటరి కాదని కుటుంబ సభ్యులకు ధీమానిచ్చారు. బరోడా మాజీ సారథి మార్టిన్ డిసెంబర్ 28న రహదారి ప్రమాదానికి గురయ్యారు. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఆయన సతీమణి లేఖ రాయడంతో బీసీసీఐ రూ.5 లక్షలు, బరోడా క్రికెట్ సంఘం రూ.3 లక్షలు సాయం చేశాయి. మార్టిన్ పరిస్థితి చూసి కుంగిపోయిన కుటుంబానికి గంగూలీ ధైర్యాన్నిచ్చారు. ‘మార్టిన్, నేను కలిసి ఆడాం. అతడు అంతర్ముఖుడని నాకు గుర్తుంది. మార్టిన్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. అతడి కుటుంబానికి ఎవరూ లేరని అనుకోవద్దని చెప్పదలుచుకున్నా’ అని గంగూలీ పేర్కొన్నారు. మార్టిన్ వైద్య ఖర్చుల కోసం మరింత మంది ముందుకు వస్తున్నారని బరోడా క్రికెట్ సంఘం కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు. జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, మునాఫ్ పటేల్, సౌరవ్, రవిశాస్త్రి తదితరులు సహాయం అందించేందుకు ముందుకొచ్చారని పటేల్ వెల్లడించారు. గంగూలీ సారథ్యంలో మార్టిన్ 1999లో టీమిండియా తరఫున 10 వన్డేలు ఆడారు. సచిన్ నాయకత్వంలో 5 వన్డేలు ఆడారు. 22.57 సగటుతో 158 పరుగులు చేశారు.