ఖైరతాబాద్ : పది రోజుల పాటు పూజలందుకున్న ద్వాదశ ముఖ లంబోదరుడిని ఉత్సవ సమితి సభ్యులు గురువారం నిమజ్జనం చేశారు. ఉదయం శోభా యాత్ర ప్రారంభం కావడంతో నగర వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. ఏడు గంటల పాటు సాగిన ఊరేగింపు అనంతరం నెక్లెస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన ఆరో నంబరు క్రేన్ వద్ద పూజలు నిర్వహించారు. యాభై టన్నుల బరువున్న గణపతిని నిమజ్జనం చేయడానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వైభవంగా సాగిని నిమజ్జనోత్సవాన్ని తిలకించడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో హుస్సేన్ సాగర్ పరిసరాలు జన సంద్రంగా మారాయి.