ఛండీగఢ్: ఆయన ఒకప్పుడు ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇన్నాళ్లు ప్రభుత్వాన్ని నడిపించిన ఆ నాయకుడు 86 ఏళ్ల వయసులో పదో తరగతి పాసయ్యాడు. ఒక్క సబ్జెక్టుతో పదో తరగతి అర్ధంతరంగా ఆపేసిన ఆయన ఇప్పుడు ఆ సబ్జెక్టులో పాసయ్యాడు. దీంతో ఆయన పదో తరగతి గండాన్ని గట్టెక్కాడు. ఆయనే హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతలా. తాజాగా శనివారం విడుదలైన పరీక్ష ఫలితాల్లో ఆయన ఉత్తీర్ణత సాధించాడు.
చౌతలా ఇటీవల 12వ తరగతి పాసయ్యాడు. అయితే ఆయన పదో తరగతి పాస్ కాకపోవడంతో ఆ ఉత్తీర్ణతను నిలిపివేశారు. ఇంగ్లీష్ సబ్జెక్టుతో ఆయన పదో తరగతి చదువు ఆగిపోయింది. ఇటీవల జరిగిన పరీక్షల్లో చౌతలా ఇంగ్లీష్ పరీక్ష రాశాడు. తాజాగా హరియాణా విద్యా బోర్డు విడుదల చేసిన పరీక్ష ఫలితాల్లో ఆయన ఇంగ్లీష్లో 100కు 88 మార్కులు సాధించి పదో తరగతి గండాన్ని దాటేశాడు. కరోనా తొలి దశలో ఓపెన్ స్కూల్లో చౌతలా ఇంటర్మీడియట్లో చేరారు. కరోనా నేపథ్యంలో పరీక్షలు రాయకుండానే ఓపెన్ విద్యార్థులంతా పాసయ్యారు. ఆ క్రమంలో చౌతలా కూడా పాసయ్యాడు. అయితే పది పూర్తి చేయకుండానే ఇంటర్ ఉత్తీర్ణత ఇవ్వడం కుదరకపోవడంతో అధికారులు ఫలితాన్ని నిలిపివేశారు. ఇప్పుడు ఓం ప్రకాశ్ చౌతలా పదో తరగతి పాసవడంతో ఇంటర్ కూడా ఉత్తీర్ణత సాధించాడు.