హొసూరు : కరోనా ప్రభావంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, వివిధ రాజకీయ పార్టీలు, స్వచ్చంధ సంస్థలు ఉచితంగా నిత్యవసరాను పంపిణీ చేస్తూ చేయూతనిస్తుండగా మరోవైపు హోసూరు అటవీ ప్రాంతంలో వన్యప్రాణులకు సరైన ఆహారం, నీరు దొరకక ఆకలితో అలమటిస్తున్నాయి. హోసూరు ప్రాంతంలో గత నెలరోజులుగా కనీవినీ ఎరుగని స్థాయిలో ఎండలు మండుతున్నాయి.ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో హోసూరు ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో నివసిస్తున్న వన్యప్రాణులకు సరైన వేళకు ఆహారం నీరు దొరకక ఆకలి దప్పికతో అలమటిస్తు అటవీ ప్రాంతం వైపు వెళ్లే వారి వైపు దీనంగా చూస్తున్నాయి.అటవీ ప్రాంతలో నిత్యం రోడ్డు పక్కన కనిపించే వానరాలను చూసే వారు వాహనాలను ఆపి వాటికి ఆహారం ఇచ్చి వెళ్లేవారు. ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్నందున వాహన రాకపోకలు నిలిచిపోవడంతో వానరాలకు కష్టాలు మొదలైయ్యాయి.అటవీ ప్రాంతంలో జలవనరులు ఇంకిపోవడంతో తాగునీరు కూడా దొరకక ఇబ్బందులు పడుతుండగా, కొందరు దాతలు అటవీ ప్రాంతంలో వన్యప్రాణులకు కూరగాయలు, నీరు పెట్టి వాటి ఆకలి తీర్చుతున్నారు.ఆకలితో అలమటించిన వానరాలకు ఆహారం దొరకడంతో గెంతులేస్తూ ఆనందంగా తిని వెళ్లడం దాతలకు ఆనందం కలిగించింది.