హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం రాయితీతో చేప పిల్లల పెంపకం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శుక్రవారం కాళేశ్వరంలోని కోయిల్ సాగర్లో మంత్రి శ్రీనివాస్ యాదవ్ చేప పిల్లలను వదిలిపెట్టి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మరో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్వర్ణ ప్రాజెక్టులో చేప పిల్లలను వదిలారు. 15 రోజుల్లోగా చేప పిల్లల పంపిణీని పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మంత్రులు ప్రకటించారు. ఇటవలి వర్షాలకు జలాశయాలన్నీ నిండాయి. దీంతో చేప పిల్లల విడుదలకు ఇదే సమయమని ప్రభుత్వం భావించింది. ఈ ఏడాది 24,953 నీటి వనరుల్లో రూ.52 కోట్ల విలువైన చేప పిల్లలను వదలాలని ప్రభుత్వం లక్ష్యం విధించుకుంది. మొత్తం 80.86 కోట్ల చేప పిల్లలు, అయిదు కోట్ల రొయ్య పిల్లలను నీటి వనరుల్లో వేయాలని నిర్ణయించింది.