ఐపీఎల్ ఫైనల్స్ను ఈసారి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో నిర్వహించే అవకాశాలున్నాయి. ఆనవాయితీ ప్రకారం కిందటి సీజన్లో ఛాంపియన్గా నిలిచిన జట్టు సొంత గడ్డపై ఫైనల్స్ నిర్వహించాలి. ఆ లెక్కన చెన్నైలో జరగాలి. అయితే చెన్నై చెపాక్ మైదాంలో పన్నెండు వేల మంది వీక్షించే అవకాశమున్న మూడు స్టాండ్ల విషయంలో వివాదం ఉంది. 2012లో తమిళనాడు క్రికెట్ సంఘం వీటిని నిర్మించింది. మునిసిపల్ కార్పొరేషన్ వీటికి అనుమతి నిరాకరించింది. దీనివల్ల మ్యాచ్ జరిగిన ప్రతి సారీ ఆ స్టాండ్లు ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. ఈ వివాదంపై వారంలోగా పరిష్కారాన్ని కుదుర్చుకోకపోతే ఫైనల్ను హైదరాబాద్కు, ప్లేఆఫ్ మ్యాచులను బెంగళూరుకు తరలిస్తామని బీసీసీఐ పాలకుల కమిటీ తమిళనాడు క్రికెట్ సంఘానికి అల్టిమేటం జారీ చేసింది.