పరారైనవారి రుణాలు మాఫీ చేస్తారా?

పరారైనవారి రుణాలు మాఫీ చేస్తారా?

న్యూఢిల్లీ : విదేశాలకు పరారైన వారి బ్యాంకు రుణాలను సాంకేతిక కారణాలతో రద్దు చేయాలని ఎందుకు నిర్ణయించారని సీనియర్ కాంగ్రెస్ నేత పి. చిదంబరం కేంద్రాన్ని ప్రశ్నించారు. యూపీఏ హయాంలో పైరవీలతో బ్యాంకు రుణాలు పొందిన వారే ఎగవేతదారుల్లో ఎక్కువగా ఉన్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. వాజ్పేయి, మన్మోహన్ సింగ్, మోదీ హయాంలో రుణాల ఎగవేతదారుల జాబితాను వేర్వేరుగా వెల్లడించాలని తాను పార్లమెంట్లో కోరితే ప్రభుత్వం జవాబివ్వలేదని తప్పుబట్టారు. రుణాలను సాంకేతిక కారణాలపై మాఫీ చేసే నిబంధనను నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యాలకు ఎలా వర్తింపచేస్తారని నిలదీశారు. రెవెన్యూ లోటును భర్తీకి ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని సడలించి రుణ పరిమితిని పెంచాలని రాష్ట్రాలు చేస్తున్న డిమాండ్ సరైనదేనన్నారు. చిన్న, మధ్య తరహా సంస్థల్లో జీతాలురాని 12 కోట్ల మందికి ఆర్థిక రక్షణ కల్పించే పథకాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సకాలంలో స్పందించకపోతే ప్రైవేట్ రంగం పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో అమలు చేస్తున్నట్లు పేచెక్ (జీతాల చెల్లింపు) రక్షణ పథకాన్ని అమలు చేయాలని సూచించారు. వలస కార్మికుల సమస్యను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. లాక్డౌన్ తొలగింపు వ్యూహాన్ని రూపొందించాలని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos