ఇదేనెల 28వ తేదీన వైసీపీ పార్టీలో
చేరనున్నట్లు కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి స్పష్టం చేసారు.వైసీపీ అధినేత జగన్తో
సమావేశమైన అనంతరం కిల్లి కృపారాణి ఈ ప్రకటన చేసారు.త్వరలో జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో
వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి తమ వంతు కృషి చేస్తామన్నారు.వైసీపీ అధినేత జగన్
మాటపై నిలబడే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని అందుకే వైసీపీలో చేరామన్నారు.గత ఎన్నికల్లో
బూటకపు హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏఒక్క
హామీ కూడా నెరవేర్చలేదంటూ విమర్శించారు.తన రాజకీయ,వ్యక్తిగత అవసరాలకు తగ్గట్లు ప్రత్యేకహోదా
అంశంపై మాట మార్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసారంటూ విమర్శించారు.ఈఐదేళ్లలో
చంద్రబాబు పాలన చూసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ముఖ్యంగా
తెదేపా ప్రభుత్వంపై అసహనంతో రగిలిపోతున్నారని ఎన్నికల్లో వైసీపీకి అధికారమిచ్చి తెదేపాను
ఇంటికి సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.గత ఏడాది డిశెంబర్లో తెలంగాణ శాసనసభకు
జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీతో కాంగ్రెస్ పొత్తును తాను తీవ్రంగా వ్యతి రేకించానని..
రాహుల్ గాంధీకి లేఖ కూడా రాశానని వెల్లడించారు.టిక్కెట్ ఆశించి వైసీపీలోకి రాలేదని
బేషరతుగా వైఎస్సార్సీపీలో చేరనున్నట్టు కృపారాణి స్పష్టం చేశారు. వైఎస్ జగన్ను
ముఖ్యమంత్రిగా చూడాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కృపారాణి చెప్పుకొచ్చారు.పార్టీలు
ఫిరాయించిన నేతలు మీడియా ముందు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సహజమే అయినా టికెట్పై స్పష్టమైన హామీ దక్కితేనే
పార్టీలో చేరడానికి ఆసక్తి కనబరుస్తారనేది అందరికి తెలిసిన బహిరంగ రహస్యం.ఈ విషయాన్ని
పక్కనపెడితే వైసిపి లో చేరుతున్న కృపారాణి ని వైసిపి ఎక్కడి నుండి బరిలోకి దింపుతుందనే
ఆసక్తి కరంగా మారింది. శ్రీ కాకుళం ఎంపీ అభ్యర్దిగా గత ఎన్నికల్లో రెడ్డి శాంతి
పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో రామ్మోహన్ నాయుడు టిడిపి నుండి గెలుపొందారు. ఇక, ఈ సారి
ఎన్నికల్లో రామ్మోహన్ స్థానంలో మరో అధికారి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వైసిపి
నుండి కృపారాణిని దించుతారా లేక టెక్కలి ఎమ్మెల్యేగా బరిలో నిలుపుతారా అనే చర్చ
పార్టీలో సాగుతోంది. కృపారా ణి తనకు ఎక్కడి నుండి పోటీ చేయమని ఆదేశిస్తే అందుకు
సిద్దంగా ఉన్నానని చెబుతున్నారు.