న్యూ ఢిల్లీ: అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన పేదల (ఎకనామికల్లీ వీకర్ సెక్షన్)కు 10 శాతం రిజర్వేషన్లను కల్పించడాన్ని సుప్రీంకోర్టు సోమవారం సమర్థించింది. ఆ చర్య రాజ్యాంగ మూల స్వరూపాన్ని ఉల్లంఘించినట్టు కాదని తెలిపింది. ఇందులో ఎలాంటి వివక్ష లేదని చెప్పింది. చీఫ్ జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలవరించింది. నలుగులు జడ్జిలు సమర్థించగా జస్టిస్ రవీంద్రభట్ మాత్రం వ్యతిరేకించారు. 2019 ఎన్నికలకు ముందు ఈ రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లను కల్పించింది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లను కల్పించింది. ఈ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి.