న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారత్లో ఇంగ్లండ్ జట్టు పర్యటన యధాప్రకారం జరుగుతుందని బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు బోర్డు చీఫ్ గంగూలీ.. రాష్ట్ర క్రికెట్ సంఘాలకు రాసిన లేఖలో తెలిపాడు. ‘భవిష్యత్ పర్యటనల కార్యక్రమాలను బీసీసీఐ, భారత టీమ్ మేనేజ్మెంట్ అమలు చేస్తాయి. ఈ ఏడాది డిసెంబరులో టీమిండియా ఆస్ట్రేలియా వెళుతుంది. స్వదేశానికి తిరిగొచ్చాక ఫిబ్రవరిలో ఇంగ్లండ్తో సిరీస్ ఆడుతుంది. ఆపై ఏప్రిల్లో ఐపీఎల్ జరుగుతుంది’ అని ఆ లేఖలో గంగూలీ వివరించాడు. కాగా.. మూడేసి వన్డేలు, టీ20లలో పాల్గొనేందుకు వచ్చే నెలలో ఇంగ్లండ్ జట్టు భారత్ రావాల్సి ఉంది. కానీ కరోనాతో ఆ సిరీస్ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ టూర్కు ఒకే చెప్పిన బీసీసీఐ దేశవాళీ క్రికెట్పై మాత్రం హామీ ఇవ్వలేదు. ‘దేశవాళీ క్రికెట్ పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నాం. అయితే ఎప్పుడనేది చెప్పలేం. రాబోయే కొద్ది నెలల్లో కరోనా తగ్గుముఖం పడుతుందని ఆశిస్తున్నాం. సురక్షిత పరిస్థితుల్లో దేశవాళీ పోటీలను నిర్వహించాలనుకుంటున్నాం’ అని గంగూలీ పేర్కొన్నాడు.