అపాయకరంగా విద్యుత్ స్తంభాలు

అపాయకరంగా విద్యుత్ స్తంభాలు

హొసూరు : ఈ ప్రాంతంలో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. హొసూరు, సూలగిరి, డెంకణీకోట తదితర ప్రాంతాలలో విద్యుత్ స్తంభాలపై సిమెంట్ పెచ్చులూడి ఇనుప కమ్మీలు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో స్తంభాల్లో విద్యుత్ ప్రసరించే ప్రమాదముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సూలగిరి సమీపంలోని మురకనపల్లి వద్ద విద్యుత్ లైను కిందకు వేలాడుతుండగా స్థానికులు కర్రల సహాయంతో నిలబెట్టారు. అదేవిధంగా ఆ ప్రాంతంలో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలే పరిస్థితిలో ఉన్నాయి. తళి సమీపంలోని గొల్లపల్లి గ్రామంలో విద్యుత్ స్తంభం నేడో, రేపో నేలకూలేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నా, అధికారులు స్పందించడం లేదని స్థానికులు వాపోతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి ప్రాణ నష్టం జరగక ముందే స్తంభాలు మార్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

తాజా సమాచారం