హైదరాబాద్ : సులభంగా ఆర్జన పేరిట విద్యార్థులను మోసం చేసిన కేసులో ఈ-బిజ్ ఎండీ పవన్ మల్హన్, ఆయన కుమారుడు హితిక్ మల్హన్లను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. గొలుసుకట్టు విధానంలో తమను మోసం చేసిందంటూ ఈ-బిజ్ సంస్థపై కేపీహెచ్బీ, మాదాపూర్ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు దాఖలయ్యాయి. దీనిపై దర్యాప్తు చేసిన సైబారాబాద్ పోలీసులు రూ.5 వేల కోట్ల మోసం జరిగినట్లు గుర్తించారు. పవన్, హితిక్లను ఢిల్లీలో అరెస్టు చేసి హైదరాబాద్కు తీసుకొచ్చి, చర్లపల్లి జైలుకు తరలించారు. తమ సంస్థకు చెందిన ఈ-లర్నింగ్ ప్రాజెక్టుల్లో చేరితే, సులభంగా డబ్బు సంపాదించుకోవచ్చని ప్రలోభ పెడుతూ సభ్యులను చేర్పించుకున్నారు. నెలలోనే పెట్టుబడి సొమ్ము సంపాదించుకోవచ్చని ఆశ చూపెట్టారు. అయితే అలా డబ్బులు తిరిగి రాకపోవడంతో ప్రశ్నించిన వారికి, మరో ముగ్గురిని సభ్యులుగా చేర్పిస్తే తప్ప డబ్బు రాదని చల్లగా చెప్పారు. జగిత్యాలకు చెందిన సామల్ల వివేక్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో అసలు విషయం బయటపడింది.