కథలాపూర్(కరీంనగర్): సర్పంచ్ పదవికి పోటీ చేస్తాననే ఉద్దేశ్యంతో ఇటీవల దుబాయి నుంచి వచ్చిన కలి కోట రాజయ్యకు నిరాశే ఎదురయింది. మండలంలోని దూలూరుకు చెందిన రాజయ్య సుమారు 10 సంవత్సరాలుగా గల్ఫ్ దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్లాడు. దాదాపు మూడు మాసాల కింద రాజన్న స్వగ్రామం చేరుకున్నాడు. ఎస్సీ జనరల్ రిజర్వ్ కావడంతో ఆ గ్రామ సర్పంచ్గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎంతో ఆశతో ఉన్న రాజయ్యకు చేదు అనుభవమే ఎదురైంది. బొమ్మెనలో నామినేషన్ వేసేందుకు రాజయ్య వెళ్లగా అక్కడి అధికారుల జాబితాలో పేరు లేదని చెప్పడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓటు వినియోగిం చుకున్నానని అధికారులకు చెప్పినా లాభం లేకపోయింది. అయితే ఇప్పుడు కొత్త జాబితాలో ఎందుకు రాలేదని తహసీల్దార్, ఎంపీడీవోలను అడిగితే జిల్లా అధికారులను కలవాలని చెప్పినట్టు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో 444 నంబర్తో తాను ఓటు వేసినట్టు చెప్పారు. ఉద్దేశ్యపూర్వకంగానే తన ఓటు కొందరు తొలగించారని ఆరోపించారు. అయితే విధిలేక తన భార్య వసంత పేరిట నామినేషన్ దాఖలు చేసినట్టు పేర్కొన్నారు.