మొహాలి : క్రికెట్లో ఫీల్డ్ అంపైర్లకు చేదోడు వాదోడుగా ఉంటుందని ప్రవేశపెట్టిన నిర్ణయ పునఃసమీక్ష పద్ధతి (డీఆర్ఎస్) తరచూ వివాదాస్పదమవుతోంది. తాజాగా ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మొహాలీలో ఆదివారం జరిగిన నాలుగో వన్డే సందర్భంగా కూడా ఇది పునరావృతమైంది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 44వ ఓవర్లో టర్నర్ వికెట్ల ఆవల వెళుతున్న బంతిని కొట్టబోయి కీపర్ రిషభ్ కు దొరికిపోయాడు. అయితే ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వకపోవడంతో కెప్టెన్ కోహ్లి రివ్యూకు వెళ్లాడు. బాల్ బ్యాటును రాసుకుంటూ వెళ్లినట్లు రీప్లేలో స్పష్టంగా కనిపించినా, థర్డ్ అంపైర్ తాను ఏమీ చెప్పలేనంటూ తుది నిర్ణయాన్ని ఫీల్డ్ అంపైర్కే వదిలివేశాడు. అయితే అంపైర్ మునుపటి నిర్ణయానికే కట్టుబడడంతో టర్నర్ బతికి పోయాడు. చివరికి అతను ఆసీస్ను విజయ తీరాలకు చేర్చాడు.
విశ్వాసం లోపించిందా….మొహాలీలో ఇప్పటి వరకు చివరన బ్యాట్ చేసిన జట్టే అత్యధిక సార్లు విజయం సాధించింది. ఈ సత్యం తెలిసుండి కూడా ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ను ఎంచుకోవడం వెనుక ఆత్మ విశ్వాసం లోపించిందా అనే అనుమానం కలుగుతోంది. మూడో వన్డే నాగపూర్లో భారత జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఎందుకంటే..చివరన ఫీల్డింగ్ చేస్తే మంచు ప్రభావం వల్ల బౌలింగ్, ఫీల్డింగ్ కష్టమనే అంచనాతో బ్యాటింగ్ కు దిగింది. అయితే అక్కడ చివరన ఫీల్డింగ్ చేసిన ఆసీస్ జట్టుకు ఎలాంటి మంచు ప్రభావం కనిపించలేదు. మొహాలీలో ఫీల్డింగ్ వైఫల్యానికి తోడు మంచు భారత జట్టు కొంప ముంచింది.