ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ గెలిచినప్పటి నుంచి మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మూడు వన్డేల్లో ధోనీ అర్ధశతకాలతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ధోనీ ముంగిట మరో రికార్డు ఎదురుచూస్తోంది. మరో రెండు రోజుల్లో న్యూజిలాండ్తో జరగబోయే వన్డే సిరీస్లో ధోనీ చోటు దక్కించుకున్న విషయం విదితమే. గతేడాది పేలవ ప్రదర్శన చేశాడనే మచ్చను పూర్తిగా తొలగించుకోవాలంటే ఈ సిరీస్లోనూ ధోనీ దూకుడు కొనసాగించాల్సి ఉంది. న్యూజిలాండ్తో జరిగిన వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇప్పటి వరకూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ పేరు మీదుంది. సచిన్ 18 మ్యాచ్ల్లో న్యూజిలాండ్పై 652 పరుగులు చేశాడు. తర్వాతి స్థానంలో వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నాడు. వీరూ 12 మ్యాచ్ల్లో 598 పరుగులు చేశాడు. ఈ జాబితాలో 455 పరుగులతో ధోనీ మూడో స్థానంలో ఉన్నాడు. సచిన్ను అధిగమించి ఈ జాబితాలో తొలి స్థానం సంపాదించుకోవడానికి ధోనీకి మరో 197 పరుగులు కావాల్సి ఉంది. ఆసీస్ పర్యటనలో ధోనీ ప్రదర్శనను బట్టి చూస్తే ఇది పెద్ద కష్టం కాకపోవచ్చు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ఈనెల 23 నుంచి ప్రారంభం కానుంది. నేపియర్ వేదికగా తొలి వన్డే, మౌంట్ మౌంగనయ్లో రెండో, మూడో వన్డేలు, హామిల్టన్, వెల్లింగ్టన్లో చివరి రెండు వన్డేలు జరగనున్నాయి.