ప్రపంచ కప్లో సెమీస్ నుంచి నిష్కృమించిన అనంతరం భారత క్రికెట్ జట్టు మాజీ సారథి ఎంఎస్ ధోనీ రెండు నెలల పాటు గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో పారాచూట్ రెజిమెంట్లో విధులు నిర్వర్తించడానికి వెస్టిండీస్ పర్యటన నుంచి సైతం తప్పుకున్న విషయం తెలిసిందే.అందులో భాగంగా ఈనెల 15వ తేదీ విధుల్లో కొనసాగనున్న ధోనీ సోమవారం కేంద్ర ప్రభుత్వం కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన లద్దాక్లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేయనున్నట్లు సైనిక అధికారులు తెలిపారు. పుల్వామా జిల్లా క్రూ ప్రాంతంలో పారా రెజిమెంట్ యూనిట్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ధోనీ.. ఈ నెల 10న తన బృందంతో కలిసి లేహ్ వెళ్లనున్నాడని ఓ సైనికాధికారి పేర్కొన్నారు. ‘భారత ఆర్మీకి ధోనీ బ్రాండ్ అంబాసిడర్. ప్రస్తుతం అతడు విధులు నిర్వర్తిస్తున్న చోట తన బృంద సభ్యులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. వారితో కలిసి ఫుట్బాల్, వాలీబాల్ ఆడుతున్నాడు. అలాగే సైనిక బలగాలతో కలిసి ఆర్మీ విధుల్లో పాల్గొంటున్నాడు. ఆగస్టు 15 వరకు ధోనీ తన విధుల్లో కొనసాగుతాడు’ అని అధికారి పేర్కొన్నారు. కాగా స్వాతంత్య్ర దినోత్సవం నాడు జమ్ముకశ్మీర్లోని ప్రతి గ్రామంలో భారత త్రివర్ణ పతాకం ఎగురవేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ధోనీ లెహ్లో జెండాను ఆవిష్కరించనున్నాడని తెలుస్తోంది.