లండన్ : కీలక సమయంలో ఓపెనర్ శిఖర్ ధావన్ అవసరమవుతాడనే ఉద్దేశంతోనే అతని స్థానంలో ఇంకొకరిని అధికారికంగా జట్టులోకి తీసుకోలేదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. న్యూజిలాండ్తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ లీగ్ మ్యాచ్ల చివరి దశలో లేదా నాకౌట్ దశలో ధావన్ తప్పకుండా అందుబాటులోకి వస్తాడని విశ్వసిస్తున్నామని చెప్పాడు. దీని వల్లే అతనిని జట్టుతోనే ఉంచుకున్నామన్నాడు. ధావన్ చేతికి నాలుగు వారాల పాటు ప్లాస్టర్ తప్పనిసరని, కోలుకున్న అనంతరం అతని సేవలను ఉపయోగించుకుంటామని వెల్లడించాడు. కాగా ధావన్ స్థానంలో రిషభ్ పంత్ ఇంగ్లండ్కు వెళ్లినప్పటికీ ఇంకా జట్టులో చేరలేదు. ఐసీసీ నిబంధనల ప్రకారం గాయపడిన ఆటగాడు పూర్తిగా జట్టు నుంచి తొలగిన అనంతరమే మరో ఆటగాడిని టెక్నికల్ కమిటీ అనుమతిస్తుంది. ప్రస్తుతం పంత్ జట్టుతో కాకుండా మాంచెస్టర్లో ఉంటాడని, ఇప్పటికైతే అతను స్టాండ్బై మాత్రమేనని బీసీసీఐ తెలిపింది. ధావన్ గాయం వల్ల అతని బ్యాటింగ్కు ఇబ్బంది లేకున్నా, ఫీల్డింగ్ సమయంలో ఇబ్బందులెదురవుతాయని జట్టు యాజమాన్యం భావిస్తోంది.