విపక్షాల వేదికైన ధర్మపోరాట దీక్ష

విపక్షాల వేదికైన ధర్మపోరాట దీక్ష

దిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించనందుకు కేంద్ర
వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు
బాగా మద్దతు లభిస్తోంది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధాని డాక్టర్‌
మన్మోహన్‌ సింగ్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా, సమాజ్‌వాది పార్టీ
నాయకుడు ములాయం సింగ్‌ యాదవ్‌, మాజీ జేడీయూ అధ్యక్షుడు శరద్‌ యాదవ్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌
ఎంపీ ఒబ్రెయిన్‌ తదితరులు దీక్షా స్థలికి చేరుకుని సంఘీభావం ప్రకటించారు.

పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీ…మన్మోహన్‌

ఆంధ్రప్రదేశ్‌కు భారత ప్రభుత్వం పార్లమెంట్‌ సాక్షిగా హామీ ఇచ్చింది. ప్రత్యేక హోదా హామీ కూడా పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిందే. ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. విభజన హామీలకు అప్పుడు అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయి. ప్రత్యేక హోదా సాధించుకోవడానికి చంద్రబాబు చేస్తున్న కృషికి అందరం సహకరిస్తాం.’’

ధర్మం తప్పినప్పుడు ఆందోళన తప్పదు: ఫరూక్

‘‘పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రానిదే. ధర్మం తప్పినప్పుడే ప్రజల్లో ఆందోళన మొదలవుతుంది. ఓట్ల కోసం ప్రజలను కులాలు, మతాలను విభజించి కేంద్రం పాలించాలని చూస్తోంది. దేశం సురక్షితంగా ఉండాలంటే ఈ ప్రభుత్వం పోవాలి. వ్యక్తిగత దూషణల స్థాయికి ప్రధాని దిగజారకూడదు. ప్రధాని అన్న వ్యక్తి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి.’’

మేమంతా బాబు వెంటే : ములాయం

‘‘ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. చంద్రబాబు వెంట మేమంతా ఉంటాం. చంద్రబాబు ఏ కార్యక్రమం చేపట్టినా ఎస్పీ ఆయన వెంటన నడుస్తోంది. చంద్రబాబు వెంట రైతులు, పేదలు, అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. వారు న్యాయం కోసం పోరాడతారు. అవసరమైతే తిరగబడతారు.’’

మాటేల తప్ప చేతలేవీ : ఒబ్రెయిన్

‘‘పార్లమెంట్‌ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. దానిపై ప్రధాని మోదీ ఒక్క మాట మాట్లాడరు. మోదీ నేతృత్వంలోని ఈ ప్రభుత్వం గద్దె దిగే సమయం ఆసన్నమైంది. మోదీ, అమిత్‌ షా ఇద్దరూ దేశ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు. తన ప్రసంగాల్లో మోదీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. కానీ దేశానికి మోదీ చేసిందేమీ లేదు. స్వతంత్ర దర్యాప్తు సంస్థలను ఆయన నిర్వీర్యం చేస్తున్నారు.’’

దీక్షకు సంఘీభావం : శరద్యాదవ్

‘‘ఏపీ ప్రజల ధర్మ పోరాట దీక్షకు సంఘీభావం తెలుపుతున్నాం. దేశం ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. రైతులు, నిరుద్యోగులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. ప్రధానమంత్రి ప్రతిపక్షాల ఐక్యతను ప్రశ్నిస్తున్నారు. ఎమర్జెన్సీ హయాంలో కూడా ఇలాగే అన్ని పక్షాలు ఏకమయ్యాయి. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదలో పడింది. అందుకే విపక్షాలు ఏకమవుతున్నాయి. కోల్‌కతాలో మమతకు ఇలాంటి సంఘీభావమే తెలిపాం. పార్లమెంట్‌ సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కరం ఏపీ విభజన హామీలు నెరవేర్చే వరకు అండగా ఉంటాం.’’

మోదీ ఓ అబద్ధాలకోరు : కేజ్రీవాల్

‘‘ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా హామీ ఇచ్చిన ప్రధాని మోదీ హామీలను అమలు చేయకుండా ఏపీ ప్రజలను మోసం చేశారు. అబద్ధాలు చెప్పడంలో ప్రధాని మోదీని మించిన వారు లేరు. మోదీ ఒక పార్టీకి కాదు.. యావత్‌ దేశానికి ప్రధాని అన్న విషయాన్ని మర్చిపోయినట్లున్నారు. హక్కుల కోసం పోరాడితే సీబీఐ వంటి సంస్థలతో దాడులు చేయిస్తున్నారు. ఏపీ ప్రజల కోసం చంద్రబాబు చేస్తున్న ఈ పోరాటానికి ఆమ్‌ ఆద్మీ పార్టీ మద్దతు ఇస్తోంది.’’

తాజా సమాచారం

Latest Posts

Featured Videos