న్యూఢిల్లీ : 2020లో భారత్ ప్రజాస్వామ్య సూచిలో రెండు స్థానాలు కిందకు జారి 53వ స్థానానికి పతనమైందని ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఇఐయు) తెలిపింది. పౌరస్వేచ్ఛపై అణచివేతల్ని అధికారులకు విపరీతంగా అధికారం ఇవ్వడం ఇందుకు కారణమని పేర్కొంది. మొత్తం 167 దేశాల్లో ప్రజాస్వామ్యంపై ర్యాంకుల్ని విడుదల చేసింది. నార్వే, ఐస్లాండ్, స్వీడన్, న్యూజిలాండ్, కెనడా తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. 2019లో భారత్ ప్రజాస్వామ్య సూచిలో మొత్తం స్కోరు 6.9 నుండి 2020కి 6.61కి పతనమైంది.మోడీ సర్కార్ హయాం మొదలైన 2014లో 7.92 గరిష్ట స్థాయి నుంచి ఇప్పుడు మరింత క్షీణ స్థితికి దిగజారింది. ర్యాంక్ 27 నుంచి 53కి కూలింది. ప్రస్తుతం అనుసరిస్తున్న అప్రజాస్వామ్య విధానాలే కారణమని పేర్కొంది. 23 దేశాలు పూర్తి ప్రజాస్వామ్య స్వేచ్ఛాయుత దేశాలుగా, 52 దేశాలను లోపభూయిష్ట దేశాలుగా, 35 వాటిని హైబ్రిడ్ పాలనలుగా, 57 నిరంకుశ పాలనలుగా వర్గీకరించింది. లోపభూయిష్టమైన ప్రజాస్వామ్య దేశాల్లో అమెరికా, ఫ్రాన్స్, బెల్జియం, బ్రెజిల్ సరసన భారత్ ఉంది. పౌరుల స్వేచ్ఛపై అణచివేతలు, అధికారుల ప్రజాస్వామ్య వెనుకబాటుతనం వల్లే భారత్, థాయి లాండ్లో ప్రజాస్వామ్యం కునారిల్లుతోంది.‘భారత్లో పౌరసత్వం పేరుతో మోడీ సర్కార్ ఒక మత పరమైన అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది. ఇది దేశంలో లౌకిక వాదాన్ని అణదొక్కే చర్యగా ప్రముఖులు పేర్కొంటున్నారు. కరోనా చర్యలు అధికారులు చేతిలోకి తీసుకోవడం వల్ల 2020లో ప్రజాస్వామ్యం దెబ్బతిన్నది. 2019లో ప్రజాస్వామ్య సూచిలో 51వ స్థానంలో కొనసాగిన భారత్ 2020 నాటికి 53కు చేరువైంది.