ఉత్తర కన్నడ జిల్లాలో మరో అద్భుతమైన పర్యాటక ప్రదేశం దాండేలి ఫారెస్ట్.చుట్టూ దట్టమైన అడవులు, పశ్చిమ కనుమలు, నదుల మధ్య ఉన్న దాండేలి కర్ణాటక రాష్ట్రానికి ముఖ్య పర్యాటక ప్రదేశంగా విరాజిల్లుతోంది.అరుదైన జంతుజాలాలతో, దట్టమైన పచ్చని ప్రకృతి అందాలతో ఈ ప్రదేశం పర్యాటకులను కనువిందు చేస్తుంది.దట్టమైన అడవుల మధ్య ఉన్న దాండెలి గ్రామం పేరుతో ఈ ప్రాంతానికి దాండేలి పేరు వచ్చిందని కొంతమంది నమ్మకం.మరి కొంతమంది దండనాయక అన్న రాజు ఇక్కడి అందాలకు మోహితుడై దీనికి దండయారణ్యం అని, ఊరికి దండేలి అని పేరు పెట్టారని చెబుతారు.అప్పట్లో మైసూర్ మహారాజులకు దండేలి వేట విడిది గా ఉండేదట.
దండేలి లో వన్య ప్రాణుల అభయారణ్యం ప్రసిద్ధి చెందినది. ఇది కర్ణాటకలో రెండవ పెద్ద వన్య ప్రాణుల అభయారణ్యం. 2007 లో టైగర్ రిజర్వ్ జోన్ గా ప్రకటించబడింది. ఈ అభయారణ్యం చుట్టూ కావేరి నది ప్రవాహాలు, కాళీ నది మరియు దాని ఉపనదులు ప్రవహిస్తుంటాయి. దండేలి వన్య ప్రాణుల అభయారణ్యం దండేలి వన్య ప్రాణుల అభయారణ్యం చేరిన తర్వాత పర్యాటకులు అక్కడి దృశ్యాలను, రివర్ వ్యాలీలను, కొండ చరియలు చూడవచ్చు. వాటిని దాటుకుంటూ అలానే ముందుకు వెళితే వివిధ రకాల వన్య జంతువులను, పక్షులను మరియు జలచరాలు గమనించవచ్చు.
200 రకాల పక్షులకు, 300 కు పైగా జంతువు జాతులకు ఈ అభయారణ్యం నిలయంగా ఉన్నది. పులి, జింకలు, గుంట నక్కలు, ఏనుగులు, దుప్పులు మొదలైన వాటితో పాటు అరుదైన పక్షులను చూడవచ్చు. ఏడాది పొడవునా దాండేలిలో వర్షం కురుస్తూనే ఉండడంతో అడవులు ఎల్లప్పుడూ దట్టంగా,పచ్చగానే ఉంటాయి.అక్టోబర్,నవంబర్ నెలలో సరాసరి నాలుగు వేల మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవుతుంది.
కాళీ నది :
కాళీ నది లో పర్యాటకులు బోటింగ్, పడవ ప్రయాణం చేయవచ్చు. ఇక్కడ అనేక పక్షులు కనిపిస్తుంటాయి. చెకుముకి పిట్టలు, మైనా, కోకిల, చిలుక ఇలా ఎన్నో గమనించవచ్చు. నది పై గల వంతెన నుండి పర్యాటకులు సదాశివ ఘడ్ ఫోర్ట్ ను చూడవచ్చు. రాప్టింగ్ పై ఆసక్తి గలవారికి ఈ నది సూచించదగినది.
కుల్గి నేచర్ క్యాంప్ :
కుల్గి నేచర్ క్యాంప్ దండేలి బస్ స్టాండ్ కు 12 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇక్కడి నుండి దండేలి వన్య ప్రాణుల అభయారణ్యం కొద్ది దూరంలో ఉంటుంది. నేచర్ క్యాంపు లో వసతి కై గుడారాలు ఉంటాయి. ఒక్కో గుడారానికి ఒక్కో పక్షి పేరు పెట్టారు.
శిరోలి పీక్ :
దండేలి నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శిరోలి పీక్ వన్య ప్రాణుల అభయారణ్యం పరిధిలోకే వస్తుంది. శిరోలి శిఖరాన్ని చేరిన పర్యాటకులు అక్కడి నుండి సహ్యాద్రి పర్వతాలను చూడవచ్చు.శిరోలి పీక్ ఉత్తర కన్నడ ప్రాంతంలో ఉన్నత శిఖరం కావటంవలన ట్రెక్కర్లు బాగా ఇష్టపడతారు . ఈ శిఖరం నుండి సూర్యాస్తమయం చూసి ఆనందిస్తారు. దండేలి వైల్డ్ లైఫ్ శాంక్చువరీ మరియు పడమటి కనుమలు కూడా కనపడతాయి. పర్యాటకులు అటవీ శాఖ అనుమతులతో ఈ ప్రాంతం ప్రవేశించవచ్చు.
కేవలం ప్రకృతి అందాలే కాదు దాండేలిలో ఇంకా చాలా చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి.ఉల్లవి దేవాలయం, సైక్స్ పాయింట్, సూపర్ హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్, కవలా గుహలు మరియు సింధేరి రాక్స్ వంటివి తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు..
ఎలా చేరుకోవాలి ?
బెంగళూరు నుంచి 490 కీలోమీటర్ల దూరంలో ఉన్న దాండేలికి బస్సు,రైలు మార్గం ద్వారా నేరుగా చేరుకోవచ్చు.