మెల్బోర్న్ : కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్ మళ్లీ భాగం కానుంది. 2022లో బర్మింగ్హామ్లో నిర్వహించే కామన్వెల్త్ క్రీడల్లో మహిళల టీ20కి స్థానం కల్పించారు. ఐసీసీ, కామన్వెల్త్ క్రీడల సమాఖ్యలు సంయుక్తంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాయి. 1998లో కౌలాలంపూర్లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారిగా క్రికెట్కు చోటిచ్చారు. దక్షిణాఫ్రికా అప్పట్లో విజేతగా నిలిచింది. బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడలు 2022 జులై 27 నుంచి ఆగస్టు ఏడో తేది వరకు జరగనున్నాయి. ఎనిమిది దేశాల క్రికెట్ జట్ల మధ్య పోటీ ఉంటుంది. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య రసవత్తర పోటీ ఖాయం. కామన్వెల్త్ క్రికెట్లోనూ ఐసీసీ నిబంధనలు వర్తిస్తాయి.