సొంత గడ్డపై మమ్మల్ని ఓడించే మొనగాడు ఉన్నాడా అని ఇన్నాళ్లు తొడగొట్టి సవాలు చేసిన ఆస్ట్రేలియా జట్టుకు భారత్ చేతిలో ఘోర పరాభవం ఎదురైంది. సొంతగడ్డపై ఏమాత్రం ఊహించని స్థాయి ఆట ఇది. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లేకపోవడంతో బ్యాటింగ్ బాగా బలహీనపడిందని అంతా అనుకున్నదే. అయితే, అనుభవజ్ఞులైన ఉస్మాన్ ఖాజా, షాన్ మార్ష్ ఆ లోటును కొంతైనా భర్తీ చేస్తారని భావించారు. ఇదేమీ జరగకపోగా, అనూహ్యంగా బౌలింగ్లోనూ కంగారూలు తేలిపోయారు. ప్రధాన పేసర్ మిషెల్ స్టార్క్ తీవ్రంగా విఫలమయ్యాడు. హాజల్వుడ్డూ అతడికి తోడయ్యాడు. కాస్తోకూస్తో కమిన్సే నయమనిపించాడు. సహజంగా తమ ఆటగాళ్లను వెనుకేసుకొచ్చే ఆస్ట్రేలియా సీనియర్లకూ ఈ ప్రదర్శనతో చిర్రెత్తినట్లుంది. దీంతో తక్షణమే జట్టులోంచి కొందరిని తీసేయాలంటూ సూచించారు. టెస్టు టెస్టుకూ ప్రత్యర్థి బ్యాట్స్మెన్, బౌలర్ల సత్తా తగ్గిపోవడంతో భారత్ పని సులువైపోయింది. సిరీస్ కోహ్లి సేన వశమైంది.