హైదరాబాద్ : శాసన మండలిలో స్థానిక సంస్థల కోటా నుంచి మూడు స్థానాలకు జరుగనున్న ఎన్నికలను వాయిదా వేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘాన్ని గురువారం కోరారు. దీనీపై ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోడాకు లేఖ రాశారు. ఇదివరకే ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ దీనిపై ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఓటర్ల జాబితా అందుబాటులో లేదని, అయినప్పటికీ రంగారెడ్డి, నల్గొండ, వరంగల్ జిల్లాల స్థానిక సంస్థల నుంచి మండలి ఎన్నికలకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ ప్రకటన విడుదల చేశారని లేఖలో ఉత్తమ్ పేర్కొన్నారు. కనుక వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులెవరో ఈ నెల 27 నాటికి తెలుస్తుందని పేర్కొన్నారు. వీరితో తాజా ఓటర్ల జాబితా సిద్ధమైన తర్వాతే ఎన్నికలను నిర్వహించాలని కోరారు.