హొసూరు : ఇక్కడికి సమీపంలోని సానమావు అటవీ ప్రాంతంలో మూడు రోజుల కిందట లారీ, కారును ఢీకొన్న సంఘటన ప్రమాదమని అందరూ భావించినా, పోలీసుల దర్యాప్తులో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సంఘటనలో కారు డ్రైవర్ మురళి సజీవ దహనం కాగా కారులో ప్రయాణిస్తున్న నీలిమా అనే మహిళ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ప్రమాదంపై విచారణ చేపట్టిన ఉధ్దనపల్లి పోలీసులు మధురైకి చెందిన లారీ డ్రైవర్ మహరాజ్ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. పథకం ప్రకారం లారీతో కారును ఢీ కొట్టించారని, ఈ సంఘటనలో కారు డ్రైవర్ బయటకు రాలేక సజీవ దహనం అయ్యాడని విచారణలో తేలింది. ఇందులో ఏదో కుట్ర దాగి ఉందని అనుమానిస్తున్న పోలీసులు హొసూరు సమీపంలోని కామన్ దొడ్డి గ్రామానికి చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. విచారణలో వాస్తవాలు వెలుగు చూడాల్సి ఉంది.