సంచలన వ్యాఖ్యలకు కేంద్రబిందువైన సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి ప్రవేశించాక తెరాస అధినేత కేసీఆర్ వల్లే మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచానని గుర్తు చేసుకున్నారు.కేసీఆర్తో కానీ ఆయన కుటుంబంతో కానీ తనకు ఎటువంటి వైరం లేదని కేసీఆర్ మేనల్లుడు హరీశ్రావుతో మాత్రమే విబేధాలు ఉన్నాయన్నారు.హరీశ్రావు చేసే బెదిరింపు రాజకీయాలు నచ్చవని హరీశ్రావు కంటే కేటీఆర్ చాలా పారదర్శకంగా,నిబద్దతగా ఉంటారన్నారు.2008లోనే హరీష్ రావు కాంగ్రెస్లో చేరేందుకు ప్రయత్నించారని ఆయన గుర్తు చేశారు.అప్పట్లో కేవీపీ ద్వారా హరీష్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేశారన్నారు.బీజేపీలో తనను అణగదొక్కేందుకు ప్రయత్నాలు జరిగిన సమయంలో కేసీఆర్ పిలిచి తనకు టిక్కెట్టు ఇచ్చారని జగ్గారెడ్డి చెప్పారు.తాను జైలులో ఉన్నపుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న హేమా హేమీ నాయకులు చూడడానికి కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి తనకు అండగా నిలిచారని తెలిపారు. వీహెచ్ తప్ప మరెవరు తనను వచ్చి పరామర్శించలేదని పేర్కొన్నారు. ఈ విషయంలో తాను చాలా హర్ట్ అయ్యానన్నారు.కాంగ్రెస్ పార్టీలో లాబీయిస్టులదే నడుస్తోందని జగ్గారెడ్డి తెలిపారు. ఇప్పుడు పదవులు వచ్చిన వారికి అలాగే వచ్చాయన్నారు. ఇప్పటికైనా లాబీయింగ్లకు అధిష్టానం వీడ్కోలు పలకాలని సూచించారు. 2004లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకొని అతిపెద్ద తప్పు కాంగ్రెస్ చేసిందని . ఆ రోజు తాను కాంగ్రెస్ పార్టీలో వెళ్లడం తప్పేనని తన తప్పేనని జగ్గారెడ్డి అంగీకరించారు.ప్రస్తుతం సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయడం కూడ తప్పేనని ఆయన అభిప్రాయపడ్డారు.కేవలం డబ్బులు,పదవుల కోసమే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెరాసలో చేరారంటూ వస్తున్న విమర్శలు,ఆరోపణలపై స్పందించిన జగ్గారెడ్డి డబ్బులు తీసుకొని పార్టీలు మారడాన్ని తప్పుబట్టారు.తాను అంతటి నీచానికి దిగజారనని జగ్గారెడ్డిని ఎవరూ కొనలేరని ఆయన చెప్పారు.