అధికార పక్ష నేతలపై మాత్రమే కాకుండా స్వపక్ష నేతలపై కూడా సంచలన వ్యాఖ్యలు చేసే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తాజాగా మరోసారి స్వపక్ష నేతలపై విరుచుకుపడ్డారు.కోవర్టుల వల్లే తెలంగాణలో కాంగ్రెస్కు ఈ దుస్థితి దాపురించిందని కోవర్టులను బయటకు పంపకపోతే పార్టీకి మరింత నష్టం జరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ అధిష్టానం చెప్పిన మాటలను,చేసిన సూచలను రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పెడచెవిన పెట్టడంతోనే తెలంగాణలో కాంగ్రెస్ ఉనికిని కాపాడుకోలేని స్థితిలో కొట్టుమిట్టాడుతోందన్నారు.ప్యారాచూట్ నేతలకు కాంగ్రెస్ పార్టీలో స్థానం లేదని అటువంటి నేతలను నమ్ముకోవద్దంటూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ సూచించినా రాష్ట్ర నేతలు నిర్లక్షం చేశారని ఆరోపించారు.ఎమ్మెల్యే టిక్కెట్టు కావాలంటే డబ్బులున్నాయా…అని ఆరా తీసి టిక్కెట్లు ఇస్తే ఇలానే ఉంటుందని వీహెచ్ పార్టీ నేతలపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.వైఎస్ఆర్ స్పూర్తి అంటే ఏమిటని వీహెచ్ ప్రశ్నించారు. వైఎస్ఆర్ పార్టీ ఏపీలో అధికారంలో ఉందని వీహెచ్ చెప్పారు. వైఎస్ఆర్ స్పూర్తితో వైఎస్ జగన్ మాదిరిగా గ్రామాల్లో పర్యటిస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.రాహుల్ గాంధీ, సోనియా, ప్రియాంకల స్పూర్తి అని ఎందుకు చెప్పరని ఆయన ప్రశ్నించారు. జగన్తో పనులు కావాలంటే ఏపీలో పనులు చేయించుకోవాలని వీహెచ్ అభిప్రాయపడ్డారు.