సూపర్స్టార్ రజనీకాంత్తో కబాలి,కాలా చిత్రాలను తెరకెక్కించి
ప్రముఖ దర్శకులు జాబితాలో చేరిన పా రంజిత్ నిర్మాతగా మారి కొత్త దర్శకుడు అథియాన్
అతిరాయ్ దర్శకత్వంలో నిర్మిస్తున్న కొత్త చిత్రం చిత్రీకరణ సమయంలో ఊహించని సంఘటన చోటు
చేసుకోవడంతో చిత్ర బృందం బిత్తరపోయింది.దినేశ్ హీరోగా తమిళంలో ‘ఇరందం ఉలగపోరిన్ కడైసి
గుండు’ అనే కొత్త చిత్రం షూటింగ్ ఓ జాతీయ రహదారిపై జరుగుతోంది.సన్నివేశం ప్రకారం చిత్రంలో
హీరో దినేశ్ లారీకి వేలాడుతూ కనిపించాలి.అందుకు సంబంధించి సన్నివేశాలు చిత్రీకరిస్తుండా
అదే సమయంలో అదే రహదారిపై ఇండియన్ ఆర్మీ వాహనం వెళుతోంది.అయితే ఇది షూటింగ్ అనే విషయం
తెలియని ఆర్మీ వాహనంలో ప్రయాణిస్తున్న కమాండోలు లారీని ఓవర్టేక్ చేసి దినేశ్ను కిందకు
దించి పాయింట్బ్లాంక్ రేంజ్లో తుపాకి గురిపెట్టారు.వాహనాన్ని ప్రమాదకరంగా నడుపుతుండడంతో
అనుమానం కలిగిన కమాండోలు వెంటనే తుపాకీ గురి పెట్టారు.ఇది గమనించిన చిత్రదర్శకుడు అతిరాయ్
బిత్తరపోయి ఆపండి అంటూ ఒక్కసారిగా గట్టిగా అరిచేశాడట.ఈ సన్నివేశంలో లారీ లోపల
కెమెరా ఉండడంతో జవానులు ఇది షూటింగ్ అని గుర్తించలేదు. ఇక్కడ షూటింగ్ జరుగుతోందని అతిరాయ్
జవానులకు వివరించడంతో వారు హీరో తలపై నుంచి తుపాకీ తీశారు. ఈ సంఘటన అక్కడున్న చిత్ర
యూనిట్ మొత్తాన్ని షాక్ కి గురిచేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత దినేష్ జవానులతో సరదాగా
ముచ్చటించాడట. ఒక వేల ఇది సినిమా షూటింగ్ కాకుండా తాను సరదాగా లారీకి వేలాడుతూ ఉంటే
నా పరిస్థితి ఏంటని దినేష్ జవానులతో చమత్కరించినట్లు తెలుస్తోంది..