తిరుమల: తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా జరిగింది. వేకువ జామున స్వామివారికి సుప్రభాతం, అర్చన సేవల అనంతరం శ్రీవారి మూలవిరాట్పై పట్టు వస్త్రంతో అర్చకులు పూర్తిగా కప్పివేశారు. నాముకోపు, శ్రీచుర్ణం, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కిచిలీ గడ్డ తదితర సుంగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలంతో ప్రదక్షిణగా వెళ్లి ఆలయ శుద్ధి చేపట్టారు. ఆనంద నిలయం, బంగారు వాకిలి, శ్రీవారి ఆలయంలోని ఉపదేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పూజా సామగ్రి తదితర అన్ని వస్తువులను శుభ్రపరిచారు. ఆలయశుద్ధి అనంతరం స్వామివారిపై కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం సమ ర్పించారు. కరోనా వైరస్ కారణంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనానికి కొందరు సిబ్బందిని అనుమతించినట్లు అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.