న్యూ ఢిల్లీ : గత పదేండ్ల మోడీ పాలనలో అన్ని రంగాల్లోనూ విధ్వంసమేనని కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ చిదంబరం అన్నారు. బీజేపీ గత పదేండ్ల పాలనలో ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. నిరుద్యోగం పెరిగిపోయిందని విమర్శించారు. గడిచిన ఐదేళ్లలో ప్రజాస్వామ్యం బలహీనపడిందని విమర్శలు గుప్పించారు. మోడీ ప్రభుత్వం ధనవంతుల ప్రభుత్వమని, దేశంలో ఉన్న ఒక్క శాతం ధనికుల కోసమే బీజేపీ పాలన సాగిందని, నిరుపేదలను మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. ప్రభుత్వ సంస్థలను పనిచేయనీయకపోవడం, బలహీన వర్గాల అణచివేత కొనసాగుతోందని అన్నారు. పార్లమెంట్ వ్యవస్థను కూడా బలహీనపరి చారని చిదంబరం ధ్వజమెత్తారు. ‘గత పదేండ్లలో దేశానికి జరిగిన నష్టాన్ని పూడ్చేలా మ్యానిఫెస్టోను సిద్ధం చేశాం. ఉద్యోగాలు, సంపద, సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తాం. గత పదేండ్లలో దేశం 5.9 శాతం మాత్రమే వృద్ధి సాధించింది. యూపీఏ తొలి విడత పాలనలో దేశం 8.5 శాతం వృద్ధి సాధించింది. 24 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చాం. 2024లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పేదల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తాం. అధికారం చేపట్టగానే మరో 23 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కల్పిస్తాం’ అని చిదంబరం వెల్లడించారు.