నాలుగేళ్లకు ఒకసారి వచ్చే ప్రపంచ కప్ మినహా క్రికెట్లో మిగిలిన రోజులన్నీ సాదాసీదాగా గడిచిపోతున్న తరుణంలో అడుగుపెట్టిన ఐపీఎల్ క్రికెట్ గతినే మార్చేసింది.ఆటగాళ్ల బౌండరీలను బద్దలుకొట్టి అన్ని దేశాల క్రికెటర్లను ఏకం చేసి బీసీసీఐ రూపొందించిన ఐపీఎల్ ఏడాదికేడాది క్రేజ్ను రెట్టింపు చేసుకుంటూ పైపైకి ఎగబాకుతోంది.ఐపీఎల్లో అవకాశం కోసం దేశీయ క్రికెటర్లతో పాటు అంతర్జాతీయస్థాయి హేమాహేమి జట్ల క్రికెటర్లు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారంటే ఐపీఎల్ క్రేజ్ ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు.అంపైర్ల వివాదాస్పద నిర్ణయాలు.. ఆటగాళ్ల విచిత్రమైన విన్యాసాలు.. గెలుపోటముల దోబూచులాట.. ఇలా ఆఖరి బంతి వరకూ అసలైన క్రికెట్ మజా గురువారం మ్యాచ్లో అభిమానులకు కనువిందు చేసింది. జైపూర్ వేదికగా చెన్నై, రాజస్థాన్ జట్ల ఉత్కంఠ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్లో పలు సరదా సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు అవి సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి.
స్టోక్స్,జడేజా ఆదుపు తప్పి నేలపై పడిపోయిన ఫొటో, ధోని తన గ్లౌవ్ విచిత్రంగా చూసుకుంటున్న ఫొటోలతో పాటు వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. వాటిపై సరదా మెమ్స్ కూడా సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి..