కర్నూలు: కర్నూలు జిల్లాలో తెదేపా సీనియర్ నేత, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ ఛైర్మన్ చల్లా రామకృష్ణరెడ్డి సోమవారం పార్టీకి , పదవికి రాజీనామా చేశారు. రెండు, మూడు రోజుల్లో జగన్తో మంతనాలు జరిపిన తర్వాత వైసీపీలోకి ఫిరాయించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కర్నూలు జిల్లాలో చల్లా రామకృష్ణారెడ్డికి సీనియర్ నేత. రెండు మూడు విధానసభ నియోజకవర్గాల్లో బలమైన అనుచర గణం ఉంది. కోవెలకుంట్ల, బనగాన పల్లి స్థానాల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పలు మార్లు గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్కు రాజీనామా చేసి తెదేపా జెండా నీడన చేరారు. విధాన సభ ఎన్నికలు సమీపించిన ప్రస్తుత దశలో తెదేపాను వీడటం ఆ పార్టీకి దెబ్బని పరిశీలకుల మదింపు. గత కొంత కాలంగా ఆయన నాయకత్వం తీరు పట్ల కొద్ది రోజులుగా అసంతృప్తిగా ఉన్నారు. గతంలో రహదారి రవాణా సంస్థ కర్నూలు ప్రాంత అధ్యక్షునిగా నియమించినందుకు పెదవి విరించారు. దరిమిలా ఆహార పౌర సరఫరాల సంస్థ అధ్యక్ష పదవిని పదవిని కట్టబెట్టారు. తాజాగా పాణ్యం విధానసభ సభ్యులు గౌరు చరితకు తేదేపా తీర్థాన్ని ఇచ్చేందుకు నాయకత్వం సుముఖంగా ఉండటమూ ఆయన అసంతృప్తిని పెంచింది. వచ్చే విధానసభ ఎన్నికల్లో బనగానపల్లి నుంచి పోటీ చేయ దలచారు. అయితే ప్రస్తుతం ఆ నియోజక వర్గానికి విధానసభలో ప్రాతినిధ్యాన్ని వహిస్తున్న బి.సి.జనార్దనరెడ్డినే వచ్చే ఎన్నికల్లో తెదేపా తమ అభ్యర్థిగా బరిలోకి దింపదలచటమూ నాయకత్వం పట్ల ఆగ్రహానికి మరో కారణం. అందువల్ల వైసిపీ అభ్యర్థిగా బనగానపల్లి నుంచి బరిలోకి దిగేందుకు తెదేపాకు దూరమైనట్లు తెలిసింది. 2014లో కాటసాని రామిరెడ్డి (వైసీపీ) అక్కడి నుంచి పోటీ చేసి ఓడారు.