దివంగత నటుడు ఆహుతి ప్రసాద్ గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు.కామెడి అయినా,విలనిజమైనా,తండ్రి ఇలా ఏపాత్రలోనైనా తన నటనతో ఆకట్టుకునే ఆహుతి ప్రసాద్కు కోనసీమ యాసలో డైలాగులు చెప్పడంలో ప్రత్యేకశైలి ఉంది.అటువంటి ఆహుతి ప్రసాద్ తనయుడు కార్తిక్ ప్రసాద్పై పోలీస్స్టేషన్లో కేసు నమోదవడం చర్చనీయాంశమైంది. బంజారాహిల్స్లోని ఓ మల్టీప్లెక్స్లో సినిమా చూడడానికి కార్తిక్ భార్యతో కలసి వెళ్లాడు.ఈ క్రమంలో సినిమా ప్రారంభానికి ముందు థియేటర్లో జాతీయగీతం వినిపించడంతో ప్రేక్షకులంతా లేచి నిలబడగా కార్తిక్ మాత్రం సీట్లో నుంచి లేవకుండా అలాగే కూర్చున్నాడు.జాతీయ గీతం ముగిసిన అనంతరం పక్క సీటులో ఉన్న హర్ష అనే వ్యక్తి జాతీయగీతం వినిపిస్తుంటే ఎందుకు లేవలేదని ప్రశ్నించగా నా ఇష్టమని అడగడానికి నువ్వెవరంటూ అసభ్య పదజాలాలతో దురుసుగా ప్రవర్తించాడు.దీంతో హర్ష అనే వ్యక్తి కార్తిక్పై దాడి చేశాడు.విషయం తెలుసుకున్న థియేటర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని ఇరువురిని శాంతింపచేశారు.కొద్ది సేపటికి నన్నే కొడతావా అంటూ కార్తిక్ మరోసారి దూషించడంతో హర్ష అనే వ్యక్తి మరోసారి కార్తిక్పై దాడి చేశాడు.తనపై దాడి చేశాడంటూ హర్షపై కార్తిక్ పోలీసులకు ఫిర్యాదు చేయగా జాతీయగీతం వినిపిస్తుంటే ఎందుకు లేచి నిలబడలేదంటూ ప్రశ్నించినందుకు తనను దూషించడంతో పాటు దాడికి పాల్పడ్డాడంటూ హర్ష కూడా కార్తిక్పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు..