హొసూరు : హొసూరు సమీపంలోని గుడి చెట్లు గ్రామంలో గల అతి పురాతన దేవాలయమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ తిమ్మరాయ స్వామి రథోత్సవాన్ని అతి వైభవంగా నిర్వహించారు. ఆలయ జీర్ణోద్ధరణ, కుంభాభిషేక కార్యక్రమాలను
గత నెలలో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఏటా ఫిబ్రవరిలో రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా రోజూ ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత తిమ్మరాయ స్వామికి విశేష అలంకరణ చేసి, రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకువచ్చి రథంలో ఉంచారు. అనంతరం వేల మంది భక్తులు గోవిందా
గోవిందా అంటూ రథాన్ని లాగి మొక్కులు తీర్చుకున్నారు. రథోత్సవాన్ని పురస్కరించుకొని గుడి చెట్లు గ్రామం భక్తులతో కిటకిటలాడింది. రథోత్సవానికి వచ్చిన భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించారు. హొసూరు ప్రాంతంవారే కాకుండా కర్ణాటక రాష్ట్రానికి చెందిన భక్తులు కూడా స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.