హోసూరు : తమిళనాడు రాష్ట్రంలో చెన్నై, కన్యాకుమారి ,కాంచీపురం మినహా అన్ని జిల్లాలకు సోమవారం నుంచి ప్రభుత్వ బస్సులను పునఃప్రారంభించారు. లాక్డౌన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ , ప్రైవేట్ బస్సులను నిలిపివేశారు. దాదాపు రెండు నెలల తర్వాత బస్సులు నడపాలని రవాణా శాఖ అధికారులు నిర్ణయించారు. చెన్నై, కాంచీపురం, కన్యాకుమారి జిల్లాలు రెడ్ జోన్లో ఉన్నందున వాటిని మినహాయించి మిగిలిన అన్ని జిల్లాలకు బస్సులు నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి వివిధ జిల్లాలకు బస్సు సర్వీసులను పునఃప్రారంభించారు. హోసూర్ నుంచి సేలం, వేలూరు తదితర ప్రాంతాలకు ప్రభుత్వ బస్సులను నడిపారు. అదేవిధంగా హోసూరు గ్రామీణ ప్రాంతాలకు కూడా బస్సులు తిరుగుతున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 50 శాతం బస్సులు రోడ్లెక్కాయి. బస్సులో ప్రయాణికులకు థర్మల్ టెస్ట్ నిర్వహించి, చేతులు శుభ్రం చేసుకున్న తరువాత బస్సులోకి అనుమతిస్తున్నారు. ఒక సీటుకు ఒకరు చొప్పున స్థానిక బస్సులలో ప్రయాణికులను అనుమతించారు. హోసూర్ నుంచి సేలం, వేలూరు తదితర దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో సీటుకు ఇద్దరు చొప్పున ప్రయాణికులను కూర్చోబెట్టి బస్సులను నడిపారు. ప్రయాణికులు తప్పక మాస్కు ధరించాలి. హోసూరులో రెండు నెలల తర్వాత సర్వీసులు పునఃప్రారంభం అయినా ప్రయాణికులు లేక అన్ని బస్సులు ఖాళీగా దర్శనమిచ్చాయి.