లండన్ : ఐటీ దిగ్గజం ఇన్పోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్తో పాటు మరో ఇద్దరు భారతీయ సంతతికి బ్రిటన్ మంత్రి వర్గంలో చోటు లభించింది. కొత్త ప్రధాని బోరిస్ జాన్సన్ మంత్రివర్గాన్ని ప్రకటించారు. రిషి సునక్ ఖజానా విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. హాంప్షైర్ కౌంటీలో జన్మించిన 39 ఏళ్ల రిషి ఆక్స్ఫర్డ్ విశ్వ విద్యాలయం నుంచి పట్టా పొందారు. 2014లో రాజకీరాయాల్లోకి వచ్చిన రిషి, 2015లో జరిగిన ఎన్నికల్లో యార్క్షైర్లోని రిచ్మండ్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. గతంలో థెరిసా మే ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు. స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో ఎంబీఏ చదివే రోజుల్లో సహ విద్యార్థిని అయిన నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. రిషితో పాటు భారత సంతతికి చెందిన అలోక్ శర్మ, ప్రీతి పటేల్లకు కూడా కేబినెట్లో స్థానం దక్కింది. యూపీలోని ఆగ్రాలో పుట్టిన శర్మ బ్రిటన్లో స్థిరపడ్డారు. 2010 నుంచి రీడింగ్ వెస్ట్ నియోజకవర్గానికి ఎంపీగా కొనసాగుతున్నారు. థెరిసా మే ప్రభుత్వంలో పర్యావరణ మంత్రిగా చేసిన శర్మ, తాజా కేబినెట్లో అంతర్గత అభివృద్ధి శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రీతి పటేల్ కొత్త కేబినెట్లో హోం సెకట్రరీగా నియమితులయ్యారు. ఈ పదవి చేపట్టిన తొలి భారత సంతతి మహిళ.