విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ప్రభుత్వం త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటిస్తుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. మంగళవారం ఆయనిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజధాని గురించి ప్రభుత్వంలో చర్చ జరుగుతోందన్నారు. త్వరలోనే ప్రభుత్వం దీనిపై ప్రకటన చేస్తుందని, అప్పుడే అన్ని వివరాలు తెలుస్తాయని చెప్పారు. ప్రస్తుత రాజధాని అమరావతిలో నిర్మాణ వ్యయం తడిసి మోపెడవుతోందని, దీని వల్ల అనవసరంగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసినట్లవుతుందని తెలిపారు. కృష్ణా నదికి ఇటీవల వరదలు రావడంతో అక్కడ ముంపునకు గురయ్యే ప్రాంతాలు ఉన్నాయని తేలిందని, దీని నుంచి రక్షణ పొందాలంటే కాలువలు, డ్యాములు నిర్మించాల్సి ఉంటుందని వివరించారు. దీని వల్ల కూడా ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందన్నారు. వరద నీటిని ప్రత్యేకంగా తోడి బయటకు పంపాల్సి ఉంటుందని చెప్పారు.