దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకే యూకే ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బ్రిటీష్ ఎంపీ బోరిస్ జాన్సన్ అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా టుడే శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మీరు యూకే ప్రధాని కావాలనుకుంటున్నారా అని ఆహూతులు ప్రశ్నించినపుడు ‘కృతజ్ఞతలు, ఆ పదవి ఖాళీగా లేదు. నా కంటే మీ ప్రధాని నరేంద్ర మోదీకే యూకే ప్రధాని అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది’ అని చమత్కరించారు. మోదీని ‘ఫైర్ క్రాకర్’ అని సంబోధించారు. ‘నేను లండన్ మేయర్గా ఉన్నపుడు మోదీ నిర్వహించిన ర్యాలీకి వచ్చిన మద్దతు దారులను చూశాకే ఆయన మీద నాకు ఆ అభిప్రాయం కలిగింది’ అని విశదీకరించారు. పుల్వామా ఉగ్రదాడి ని తనతో పాటు తమ దేశంలో ప్రతి పౌరుడు ఖండించారు. మా దేశ ప్రజలందరూ భారత్కు మద్దతుగా నిలుస్తారు. రెండు దేశాలను వేధించే ఉగ్రవాదాన్ని తరిమికొట్టడానికి భారత్తో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నాం. పైలట్ను విడుదల చేయాలన్న పాకిస్థాన్ ఆలోచన మంచి నిర్ణయం’ అని పేర్కొన్నారు.