ఢిల్లీ : ఈ సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యలు ఏకపక్షంగా, వివాదాస్పదంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో రీపోలింగ్పై శుక్రవారం ఈసీతో సమావేశమైన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈసీ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుందని ఆరోపించారు. ఈసీ పనితీరుకు నిరసన తెలపాల్సి రావడం దురదృష్టకరమన్నారు. ఏపీలో ఎన్నికలు జరిగిన 34 రోజుల తర్వాత రీపోలింగ్కు ఎలా ఆదేశాలు జారీ చేస్తారని ఈసీని నిలదీశానని తెలిపారు. మోది, అమిత్ షా చెప్పిన విధంగా ఈసీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇలాంటి ఎన్నికల సంఘాన్ని తానెప్పుడూ చూడలేదని నిష్టూరమాడారు. జాతిపిత మహాత్మా గాంధీపై సాధ్వి ప్రజ్ఞా సింగ్ అనుచిత వ్యాఖ్యలు చేసినా ఈసీ పట్టించుకోలేదన్నారు. వైకాపా ఓటర్ల జాబితాకు సంబంధించి అనేక అక్రమాలకు పాల్పడిందని, దీనిపై ఫిర్యాదు చేసినా ఈసీ మౌనంగానే ఉండిపోయిందని ఆయన దుయ్యబట్టారు.