అమరావతి : డీఎంకే కోశాధికారి దురై మురుగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మగళవారం కలుసుకున్నారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో భేటీ అయ్యారు. తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు సోమవారం చెన్నైలో డీఎంకే అధ్యక్షుడు ఎంకే. స్టాలిన్తో సమావేశమైన మరుసటి రోజే దురై మురుగన్ ఇక్కడికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేసీఆర్తో సమావేశం సందర్భంగా తాను కాంగ్రెస్ కూటమిని కాదని బయటకు రాలేనని స్టాలిన్ నిస్సహాయత వ్యక్తం చేశారని సమాచారం. కేంద్రంలో కాంగ్రెస్ లేదా బీజేపీ మద్దతు లేనిదే ప్రభుత్వ ఏర్పాటు అసాధ్యం కనుక కేసీఆర్ను కూడా కాంగ్రెస్ కూటమిలోకి రావాల్సిందిగా స్టాలిన్ ఆహ్వానించారని తెలిసింది. చంద్రబాబు నాయుడుకు డీఎంకేతో తొలి నుంచీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. స్టాలిన్, కేసీఆర్ల సమావేశం గురించి చంద్రబాబుకు తెలియజేయడంతో పాటు డీఎంకే వైఖరిపై ఆయనకేమైనా అనుమానాలుంటే పటాపంచలు చేయడానికే దురై మురుగన్ ఇక్కడికి వచ్చారని తెలిసింది.