ప్రత్యర్థి ఆటగాళ్ల మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీయడం ద్వారా పైచేయి సాధించడంలో దిట్టగా పేరొందిన ఆస్ట్రేలియా…ఇండియాతో సిరీస్ మొదలు కాకముందే తన నైజాన్ని బయటపెట్టుకుంది. మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ మాటల సమరానికి తెర తీశారు. మా ఆటగాళ్లతో ఇండియా జట్టుకు ఇబ్బందులు తప్పవులే అని అతను హెచ్చరిస్తున్నాడు. ఇందులో భాగంగా ఆసీస్ ఆల్రౌండర్ స్టొయినిస్కు కితాబునిచ్చాడు. స్వదేశం, విదేశం అనే తేడా లేకుండా అతను రాణిస్తూ ఉంటాడని ప్రశంసించాడు. టీమిండియా ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా కంటే స్టొయినెస్ మెరుగైన ఆటగాడని కొనియాడాడు. పాండ్యా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పాడు. ఓపెనర్ శిఖర్ ధావన్కు ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్తో తిప్పలు తప్పవని కూడా హెచ్చరించాడు. స్వింగ్, షార్ట్ బంతులను ఆడడంలో ధావన్ పరిణతి సాధించాలన్నాడు. ఇదే సమయంలో స్పిన్నర్ యజువేంద్ర చాహల్ను పొగిడాడు. అతనితో తమ ఆల్రౌండర్ మ్యాక్స్వెల్ ఇబ్బందులేనన్నాడు. భారత పర్యటనలో ఆసీస్ రెండు టీ20లు, అయిదు వన్డేలు ఆడనుంది. విశాఖ వేదికగా తొలి టీ20 ఈ నెల 24న ఆడాల్సి ఉంది.