ఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలపై ఢిల్లీ శాసన సభ స్పీకర్ రామ్ నివాస్ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేశారు. ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ బాజ్పాయ్, కల్నల్ దేవేందర్ సెహ్రావత్లను అనర్హులుగా ప్రకటించారు. ఇటీవల వీరు బీజేపీలో చేరారు. ఆప్ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ ఫిర్యాదు మేరకు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేసినట్టు ఢిల్లీ అసెంబ్లీ ఓ ప్రకటనలో పేర్కొంది. బీజేపీలో చేరిన నాటి నుంచే.. అంటే మే 3 నుంచి బాజ్పాయ్, మే 6 నుంచి సెహ్రావత్ల అనర్హత అమల్లోకి వస్తుందని స్పీకర్ పేర్కొన్నారు. ఈ నెల 2న ఆప్ ఎమ్మెల్యే కపిల్ మిశ్రాను అనర్హుడిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.