ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రామ వాలంటీర్ల నియామకంపై దాఖలైన పిటిషన్ను రాష్ట్ర హైకోర్టు తోసిపుచ్చడంతో గ్రామ వాలంటీర్ల నియామక ప్రక్రియకు మార్గం సుగమమైంది.గ్రామవాలంటీర్ల నియామకాలకు ఇంటర్వ్యూలు చేపట్టడాన్ని ప్రశ్నిస్తూ కొంతమంది బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ప్రభుత్వంతో పాటు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో కూడా ఆందోళన నెలకొంది. వాలంటీర్ల ఎంపిక ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పంచాయతీరాజ్ శాఖ జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ బుధవారం నాడు మేడికొండూరుకు చెందిన శివరామకృష్ణ, గుంటూరు జిల్లా కొర్రపాడుకు చెందిన బసవయ్య పిటిషన్ దాఖలు చేశారు.దీంతో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన న్యాయవాది శ్రీరామ్ గ్రామ వాలంటీర్ పోస్టులు క్యాడర్ పోస్టులు కాదని.. వాటికి కాలపరిమితి లేదని తెలిపారు. అంతేకాదు ఆ పోస్టుల్లో నియమితులైనవారికి పదవీ విరమణ లేదని.. సర్వీస్ గ్యారెంటీ కూడా లేదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పథకాల్ని ఇంటింటికీ చేర్చడమే లక్ష్యంగా గ్రామ వాలంటీర్లకు కేవలం నెలకు 5వేల రూపాయల గౌరవం వేతనం మాత్రమే ఇవ్వనున్నారని.. ఎలాంటి అదనపు సౌకర్యాలు కూడా లేవని వివరించారు. కేవలం ఇద్దరు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్ కారణంగా 9 లక్షల మందికి నిర్వహించనున్న నియామక ప్రక్రియను ఆపడం సమంజసం కాదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.శ్రీరామ్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి మానవేంద్రనాథ్ రాయ్ గ్రామ వలంటీర్ల ఎంపిక ప్రక్రియను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్ను కొట్టేశారు. ఈ మేరకు దాఖలైన అనుబంధ పిటిషన్ను తోసిపుచ్చింది. ప్రధాన పిటిషన్ను స్వీకరించిన.. చీఫ్ సెక్రటరీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, మున్సిపల్ శాఖ, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శులకు, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేశారు.పిటిషన్ను కోర్టు కొట్టివేయడంతో వాలంటీర్ల నియామక ప్రక్రియ ఊపందుకుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి దాఖలైన తొమ్మిది లక్షల దరఖాస్తుల్లో అభ్యర్థులను ఫిల్టర్ చేసేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధిరారులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.ఒకవేళ ఏదైనా మండలంలో ఏడు వందలకు పైగా అప్లికేషన్లు వస్తే.. అదనంగా ఇంటర్వ్యూ బోర్డులను ఏర్పాటు చేసుకోవాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. ఈ నెల 20వ తేదీ వరకు ఇంటర్వ్యూల ప్రక్రియ కొనసాగనుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు అధికారులు. ఇంటర్వ్యూ ప్రక్రియలో భాగంగా తొలి రోజు గురువారం నాడు ఒక్కో చోట 30 మందిని మాత్రమే ఇంటర్వ్యూలకు పిలవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక రెండో రోజు నుంచి మాత్రం రోజుకు 60 మంది చొప్పున ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. దివ్యాంగులు, మహిళా అభ్యర్థులను మాత్రం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల మధ్య ఇంటర్వ్యూలకు పిలవాలని ఆదేశాలు అందాయి.