ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి గెలిచిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి వైసీపీ ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యత దక్కుతుండడంపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.ఇప్పటికే చెవిరెడ్డిని ప్రభుత్వ విప్గా నియమించిన వైఎస్ జగన్ తొలి నామినేటెడ్ పదవి తిరుపతి నగర అభివృద్ధి అథారిటీ చైర్మన్ పదవిని సైతం చెవిరెడ్డికి అప్పగించారు.తాజాగా చట్ట సవరణ చేసి మరీ చెవిరెడ్డికి మరో కీలక పదవి అప్పగించడానికి వైఎస్ జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డులో తుడా ఛైర్మన్ను ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నియమిస్తూ చేసిన చట్ట సవరణ కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీని ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలు చేసిన నిర్ణయాన్ని తిరిగి అమలు చేసే విధంగా జగన్ ప్రభుత్వం సవరణ చేసింది. ఈ నిర్ణయం తో చెవిరెడ్డి తుడా ఛైర్మన్ హోదాలో టీటీడీ బోర్డులో ఎక్స్ అఫీషి యో సభ్యుడి హోదాలో కొనసాగనున్నారు. టీటీడీ బోర్డు ఛైర్మన్గా సుబ్బారెడ్డిని నియమించిన ముఖ్యమంత్రి జగన్.. ఇప్పుడు పరోక్షంగా చెవిరెడ్డి భాస్కర రెడ్డిని టీటీడీ తొలి సభ్యుడిగా నియమించినట్లుగా స్పష్టం అవుతోంది.మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ఉంటున్న చెవిరెడ్డి భాస్కర్రెడ్డి వైఎస్ఆర్ హయాంలో కూడా తుడా చైర్మన్గా పని చేశారు.వైఎస్ మరణం అనంతరం వైఎస్ జగన్కు మరింత సన్నిహితుడిగా మారిన చెవిరెడ్డి 2014,19 ఎన్నికల్లో వైసీపీ నుంచి చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు.దీంతో మొదటి నుంచి తమ కుటుంబానికి బాసటగా ఉంటున్న చెవిరెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి..