హొసూరు : ఇక్కడికి సమీపంలోని కెలవరపల్లి వద్ద గల అతి పురాతన దేవాలయంగా ప్రసిద్ధి చెందిన సప్పలమ్మ దేవాలయ వార్షిక పూజలు, ఎద్దుల జాతర మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 26 వరకు జరిగే వార్షికోత్సవంలో భాగంగా అమ్మవారికి విశేష పూజలు జరగనున్నాయి. తొలి రోజు అమ్మవారిని వివిధ రకాల పుష్పాలు, పట్టు వస్త్రాలతో అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయం ముందు గోపూజను నిర్వహించి జాతరను ప్రారంభించారు. అయిదు రోజుల పాటు అమ్మవారికి విశేష పూజలు, దీపారాధనతో పాటు అన్నదాన కార్యక్రమాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వార్షికోత్సవంలో భాగంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు దీపారాధన కార్యక్రమాలు, పూజలు నిర్వహించనున్నారు.