ప్రస్తుత పరిణామాలకు పాలకులదే బాధ్యత

ప్రస్తుత పరిణామాలకు  పాలకులదే బాధ్యత

న్యూ ఢిల్లీ : ‘దేశంలో రైతులు తమ హక్కుల కోసం తప్పనిసరిగా పోరాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీని పరిణామాలకు కేంద్రమే బాధ్యత వహించాల’ని శుక్రవారం రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ సభ్యుడు ఆనంద శర్మ వ్యాఖ్యానించారు. గణతంత్ర దినోత్సవం రోజు రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా.. గాయపడిన పోలీసు సిబ్బంది, అధికారుల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. సాగు చట్టాల రద్దు కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన 194 మంది రైతులకు నివాళి అర్పించారు. ‘ఎర్రకోట ఘటన అందరినీ షాక్కు గురిచేసింది. దానిపై కచ్చితంగా విచారణ జరగాల్సిందే. పౌర చట్టాలు లేదా సాగు చట్టాలు ఏవైనా.. వీటి రాజ్యాంగ బద్ధతను తక్షణమే నిర్దరించాలి. ఈ అంశంలో సుప్రీం కోర్టు ఇంత సమయం ఎందుకు తీసుకుంటుందో’ అని ఆందోళన వ్యక్తం చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఎంపీ సతీశ్ చంద్ర మిశ్రా.. కేంద్రంపై విరుచుకుపడ్డారు. కేంద్రం అహాన్ని వీడి మూడు నల్ల సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ‘రైతులు దిల్లీలోకి రాకుండా సరిహద్దుల్లో భారీ భద్రతా చర్యలు చేపట్టారు. రోడ్డుపై మేకులు ఏర్పాటు చేశారు. కానీ ఇవన్నీ చైనా, పాకిస్థాన్ సరిహద్దులో చేయాల్సింది. అది దేశానికి మంచిది కూడా. గత రెండు నెలలుగా రోడ్డెక్కిన అన్నదాతలను ప్రభుత్వం శత్రువుల్లా చూస్తోంది. ప్రభుత్వం అహంకారాన్ని పక్కనబెట్టి రైతుల సమస్యలను వినాలి. సాగు చట్టాలను రద్దు చేయాల’ని డిమాండు చేసారు. ‘రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, ఇప్పుడు రైతులు.. ఇలా ప్రశ్నించేవారందరినీ కేంద్రం దేశ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తోంది. గణతంత్ర దినోత్సవాన రభసలకు కారణమైన వారిని వదిలేసి రైతులను అరెస్టు చేయడం సరికాదు. అల్లరికి కారకుడైన దీప్ సిద్ధూ ఎక్కడ? ప్రభుత్వం ఆయనను ఎందుకు పట్టుకోలేకపోతోంది? రైతుల ఆందోళనపై దుష్ప్రచారం చేయడం సరికాద’ని శివసేన సభ్యుడు సంజయ్ రౌత్ అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos