చెన్నై : సార్వత్రిక ఎన్నికల్లో పరాజయానికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ దృఢ నిశ్చయంతో ఉన్నారన్న వార్తలతో మిత్ర పక్షాలు ఆయనను వారించే ప్రయత్నాల్లో పడ్డాయి. అలాంటి నిర్ణయం తీసుకోవద్దని సూచిస్తున్నాయి. మీ నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి ఆత్మహత్యా సదృశమవుతుందని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. మీ నిర్ణయం వల్ల పార్టీ సంక్షోభంలోకి వెళుతుందని కూడా హెచ్చరించారు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కూడా రాహుల్కు ఫోన్ చేశారు. అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాలన్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని సూచించారు. దీనిపై స్టాలిన్ సోనియా గాంధీతో కూడా మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే-కాంగ్రెస్ కూటమి తమిళనాట ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.