న్యూఢిల్లీ:నగరంలోని ఓటర్ల జాబితా నుంచి పెద్ద ఎత్తున పేర్లు తొలగించారనే ఆరోపణ కేసులో అతిషి సహా ఇతర ఆమాద్మీ పార్టీ నేతలకు ఢిల్లీ కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఆప్ నేతల ఆరోపణల్ని ఖండించిన భాజపానేత రాజీవ్ బబ్బార్ వారికి వ్యతిరేకంగా న్యాయస్థానంలో పరువు నష్టం దావా దాఖలు చేసింది. శుక్రవారం విచారణకు హాజరైన అతిషి, రాజ్యసభ సభ్యుడు సుశీల్ కుమార్ గుప్తా, శాసనసభ్యుడు మనోజ్ కుమార్లకు వారి వినతి మేరకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తి గత పూచీకత్తు కింద వీరంతా రూ.10 వేలు వంతున చెల్లించాలని ఆదేశించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేక పోవటంతో ఆయనకు బెయిల్ మంజూరు కాలేదు. ఈ నెల 16న విచారణకు హాజరు కావాలంటూ న్యాయస్థానం ఆయన్ను ఆదేశించింది. బానియా, పూర్వాంచలి సహా ముస్లిం వర్గానికి చెందిన 30 లక్షల ఓటర్ల పేర్లను జాబితా నుంచి ఎన్నికల సంఘం తొలగించిందని ఆప్ నేతలు ఆరోపించారు.